
సూర్యాపేట, వెలుగు : గిరిజనులను చైతన్య పర్చడానికి సూర్యాపేటలో మూడు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలంగాణ ట్రైకార్ చైర్మన్ బెల్లయ్యనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తెలిపారు. ఈనెల 24, 25, 26వ తేదీల్లో సూర్యాపేటలోని రాజాబహదూర్ వెంకట్ రామిరెడ్డి వసతి గృహం(రెడ్డి హాస్టల్) లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఆదివారం సూర్యాపేటలోని శిక్షణ తరగతుల ఏర్పాట్లను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఐదుగురు చొప్పున గిరిజనులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామన్నారు. దేశవ్యాప్తంగా గిరిజనులు, ఆదివాసీల చైతన్యం కోసం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వ హించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. వారి వెంట కాంగ్రెస్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ భూక్యా కోటియా నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్, పట్టణ అధ్యక్షుడు రమేశ్, నాయకులు తదితరులు ఉన్నారు.